నాయుడుపేట బస్టాండ్లో మహిళ కాలుపై నుంచి దూసుకెళ్లిన బస్సు….ప్రయాణికులుని నెట్టేసిన కండక్టర్ నుజ్జునుజ్జయిన మహిళ కుడికాలు…ఆర్టీసీ నిర్లక్ష్యంతో నడిరోడ్డుపై విషాదం సూళ్లూరుపేట జూలై 01( ఇదినిజం డివిజన్ ఇన్చార్జి):
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రమాదం వివరాలు శ్రీకాళహస్తికి వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో కలిసి బస్సు ఎక్కుతున్న గుణపాటి హైమావతి 55 తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉందని సాకుతో కండక్టర్ ఆమెను బలంగా తోసేయడంతో అదుపుతప్పి బస్సు ముందు చక్రం కింద పడిపోయారు. ఈ దుర్ఘటనలో హైమావతి కుడికాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్ ద్వారా బాధితురాలిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆర్టీసీ నిర్లక్ష్యంపై ఆగ్రహంఈ ప్రమాదానికి కండక్టర్ నిర్లక్ష్యమా లేక ఆర్టీసీ అధికారుల అనాలోచిత విధానాలా అని ప్రజలు నిలదీస్తున్నారు. నియోజకవర్గంలో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు ఎక్కేందుకు సైతం యుద్ధం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బస్సుల కొరత తీర్చాల్సిన అధికారులు, రద్దీని సాకుగా చూపి ప్రయాణికుల పట్ల అమానుషంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస మానవత్వం లేకుండా తోసేయడంతో ఒక మహిళ జీవితం అంధకారమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కళ్లు తెరవాలని, తగినన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





