*తహశీల్దార్ కార్యాలయంలో తాగునీటి సమస్య… ఖాళీ కుండలతో దర్శనం ఇబ్బంది పడుతున్న ప్రజలు*
సూళ్లూరుపేట అర్బన్ (ఇది నిజం ప్రతినిధి )తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన కుండల నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూళ్లూరుపేట తహశీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఎండ తీవ్రతలో తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నారు.ప్రభుత్వం వేసవి దృష్ట్యా కార్యాలయాల వద్ద చల్లని తాగునీరు అందించాలని ఆదేశాలు ఇచ్చినా, తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుండల్లో నీళ్లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కనీస అవసరమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





