గుంతలగుబాళింపు….పశువుల సంచారం..
హైవేపై ప్రయాణం ప్రాణ భయమే!
టోల్ వసూళ్లు ఫుల్.. రోడ్ల నిర్వహణ నిల్!
మృత్యు మార్గంగా మారుతున్న నెల్లూరు–ముంబై జాతీయ రహదారి…
హైవేపై అడుగడుగునా ప్రమాద హెచ్చరికలు.. చర్యలు మాత్రం శూన్యం:
ఆత్మకూరు :(ఇదినిజం ప్రతినిధి ):
నెల్లూరు–ముంబై జాతీయ రహదారితో పాటు ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల పరిస్థితి వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రహదారులపై గుంతలు, దెబ్బతిన్న ఉపరితలం, రాత్రి వేళల్లో పశువుల సంచారం, తగిన హెచ్చరిక బోర్డుల కొరత వంటి సమస్యలు నిత్యం ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గాల్లో పలు చోట్ల రహదారి దెబ్బతిన్నప్పటికీ మరమ్మత్తు పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఏర్పడిన గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇదే సమయంలో జాతీయ రహదారులపై పశువుల సంచారం మరో ప్రధాన సమస్యగా మారింది. రాత్రివేళల్లో రహదారులపైకి వచ్చే పశువుల కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై సంబంధిత శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.రహదారుల భద్రతకు అవసరమైన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వేగ నియంత్రణ సూచికలు, ప్రమాద ప్రాంతాల గుర్తింపులో కూడా లోపాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారులపై నిరంతర పర్యవేక్షణ, హైవే పెట్రోలింగ్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి టోల్ రుసుములు యథావిధిగా వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. టోల్ వసూలు చేస్తున్న స్థాయిలో రహదారుల నిర్వహణ, మరమ్మత్తులు, భద్రతా చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల రహదారి భద్రతపై రెవెన్యూ, పోలీసు, రవాణా, జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులపై పశువుల సంచారం, డ్రైవర్ల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపాలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.అయితే సమస్యలు తీవ్రరూపం దాల్చిన తర్వాత కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గుంతలను వెంటనే పూడ్చడం, రహదారుల మరమ్మత్తులు వేగవంతం చేయడం, పశువుల సంచారాన్ని నియంత్రించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, హైవే భద్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.జాతీయ రహదారుల నిర్వహణలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారాలు అమలు చేస్తేనే ప్రయాణికులకు భద్రత కల్పించగలమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.